ప్రతి ఒక్కరిలోనూ సహజసిద్ధమైన సామర్థ్యం లేదా యోగ్యతా ఉంటాయి. దీన్నే ఆప్టిట్యూడ్ అంటారు. వాస్తవానికి , ప్రకృతి మనంరదరిలోనూ ఒకేరకమైన సామర్థ్యాన్ని నింపింది. కానీ, వ్యక్తికీ వ్యక్తికీ మధ్య వేరు వేరుగా ఉంటుంది. ఆ భిన్నత్వంలోని సంక్లిష్టతను అర్థం చేసుకోవడంలో చాలా మంది విఫలమవుతుంటారు. అందుకే యోగ్యతా పరీక్షల్లో (ఆప్టిట్యూడ్ టెస్ట్) 70 నుంచి 80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేకపోతారు. టెక్నికల్, కమ్యూనికేషన్ అంశాల్లో ఎంతో నైపుణ్యం ఉన్న యువ కుల్లో చాలా మంది ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్లో ఫెయిల్ అవుతుంటారు. దిన దిన ప్రవర్థమానంగా ఎదగకపోవడమే కాకుండా వీళ్లు ఫెయిల్ కావడానికి మరో మూడు కారణాలు ప్రధానంగా కనిపిస్తాయి. చాలా మంది విద్యార్థులు గణితాంశాలు, ఆప్టిట్యూడ్ అంశాలు రెండూ ఒకటేననుకుంటారు. ఈ కారణంగానే ‘గణితంలో నాకు మంచి మార్కులే వస్తున్నాయి కాబట్టి, నేను ఆప్టిట్యూడ్ పరీక్షకు హాజరు కావలసిన అవసరం లేద’ని అనుకుంటారు. అత్యధికుల్లో ఉండే భావనే అయినా ఇది పూర్తిగా తప్పు. ఎందుకంటే, గణితంలో ప్రథమ స్ధానంలో ఉన్న ఒక విద్యార్థి యోగ్యతకు సంబంధించిన టెస్టుల్లో దారుణంగా ఫెయిల్ కావచ్చు. యోగ్యతా పరీక్షా ప్రశ్నలు చాలా సులువుగా ఉంటాయని, అవన్నీతాము అంతకుముందు చదివేసినవే అనుకుని చాలా చాలా మంది నిర్లక్ష్యంగా ఉండిపోతారు. నిజానికి గ్రూప్ 1 ఎగ్జామ్స్ మొదలుకుని, ఏ కాంపిటీటివ్ టెస్ట్లోగానీ, క్యాట్, ఐటి జాబ్స్, ఐఏఎస్ జాబ్స్కు సంబంధించిన ఎగ్జామ్స్లల్లో గానీ, వచ్చే ప్రశ్నలన్నీ 8, 9, 10 తరగతుల లేదా సిబిఎస్ఇ సిలబ్సలల్లోంచే వస్తాయి. దాని వల్ల ‘‘ఆయా తరగతుల్లో అప్పుడు మంచి మార్కులే పొందాం కదా ఆ సిలబస్ను ఇప్పుడు మళ్లీ చదవాల్సిన అవసరమేముంది?’’ అనుకుంటారు. వాస్తవానికి, మంచి మార్కులు సంపాదించడం వేరు, సమస్యను నైపుణ్యంగా పరిష్కరించడం వేరు. అందుకే అంతకు ముందు చదువుకున్న విషయాలే అయినా అప్పుడు చదివిన కోణం వేరు. ఇప్పుడు చూడాల్సిన కోణాలు వేరు. అందువల్ల పాత సిలబ్సనే మళ్లీ కొత్తగా చదవడం మొదలెట్టాలి. అందుకు అనుగుణంగా మీ మైండ్ సెట్ను మార్చుకోవాలి. ఆధారము: ఆంధ్రజ్యోతి