ధనుర్వాతం ఒక బాక్ట్రీరియల్ ఇన్ఫెక్షన్. శరీరంలోని నాడులు మరియు కండరాల మీద దీని ప్రభావం వుంటుంది. ఈ బాక్టీరియా జంతువుల మలంలో, అప్పుడప్పుడు మనుషుల మలంలో కూడా కనిపిస్తుంది. తర్వాత అది నెమ్మదిగా భూమిలో కూడా కలుస్తుంది. సాధారణంగా లోతైన గాయాలు. ముఖ్యంగా జంతువులు కరవడం వల్ల ఇది మానవుల శరీరంలోకి ప్రవేశిస్తుంది. లక్షణాలు: సాధారణంగా మింగడానికి ఇబ్బందిగా ఉండడం. దవడ ఎముక బిగుసుకు పోవడం. మెడ కండరాలు, శరీరంలోని ఇతర భాగాల్లోని కండరాలు కూడా బిగుసుకోవడం. పాప మామూలుగా నడవలేకపోవడం. దవడలో విపరీతమైన నొప్పి ఆరంభమై క్రమంగా శరీరమంతా వ్యాపిస్తుంది. కదలడం లేదా ఎవరైనా తాకడం వల్ల అకస్మాత్తుగా నొప్పి లేదా మూర్చ వస్తుంది. ధనుర్వాతం కలిగించే గాయాలు: శుభ్రంగా లేని సూదులను ఉపయోగించి వేసిన రంధ్రాలు, కుట్ల వల్ల . ఏదైనా ఇనుప ముక్క లేదా మేకు గుచ్చుకోవడం వల్ల కలిగిన గాయాల వల్ల. కుక్కలు, పందులు వంటి జంతువులు కరచినపుడు కలిగిన గాయాల వల్ల వచ్చే అవకాశం వుంది. చికిత్స: ధనుర్వాతం ప్రాణాంతక వ్యాధి. అనుమానం కలిగిన వెంటనే ఆసుపత్రికి తీసుకొని పోవాలి. శరీరం మీద ఎక్కడైనా గాయం వుందేమో గమనించాలి. సబ్బు, శుభ్రమైన చల్లని నీటిని ఉపయోగించి శుభ్రం చెయ్యాలి. గాయం మీద ఎక్కువ మొత్తంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ పోయాలి