జంక్ ఫుడ్స్ తినడమంటే, కూల్ డ్రింక్స్ తాగడమంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే, చిరుధాన్యాలలో పోషక విలువలు, యాంటి ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్, పీచు అధికంగా వుండడం వల్ల పిల్లల ఆరోగ్యానికి అవి చాలా మేలు చేస్తాయి. జంక్ ఫుడ్స్ మానేసి, వారానికి ఒక గంట శ్రమపడితే ఇంట్లోనే తల్లులు చిరుధాన్యాలతో చిరుతిండ్లు తయారు చేసుకోవచ్చు. పిల్లల ఆరోగ్యం కాపాడుకోవచ్చు. మన ఆరోగ్యాల్ని కూడా కాపాడుకోవచ్చు. మనం ఆధునిక జీవన శైలిలో భాగంగా వరి అన్నం మాత్రమే తింటున్నాం. జొన్న, రాగి, సజ్జ, కొర్రలతో చేసిన ఆహార పదార్థాలలో, సంగటో ఎవరో తింటూ వున్నా, వాళ్లు మన జనాభాలో చాలా స్వల్పమే. వరి తినడం మన శరీరంలో కార్బోహైడ్రేట్ లను పెంచి మన ఊబకాయానికి కారణమవుతుంది. మనలో అత్యధికులు ఇప్పటికీ నిత్యం వ్యాయామం చేయాలన్న స్పృహలో లేరు. ప్రతి చిన్న దూరానికీ వాహనాలే వాడుతున్నాం. ఇంట్లో మన అమ్మలూ నాన్నలూ, అవ్వలూ తాతలూ చేసిన శారీరక శ్రమ మనం చేయడం లేదు. అన్ని పనులూ చాలా సులభంగా జరిగిపోతున్నాయి. ఇవి మనకు సుఖాన్నే ఇస్తున్నాయి. అంతకు మించి చాలా విలువైన మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరి సంబంధిత ఆహారాన్ని మానేయాల్సిన లేదా తగ్గించుకోవాల్సిన ఒక తక్షణ అవసరం ప్రస్తుతం వుందని జనవిజ్ఞాన వేదిక భావిస్తోంది. ఆహార విజ్ఞాన శాస్త్రవేత్తలూ అదే చెబుతున్నారు. అలాగే కూల్ డ్రింక్స్ తాగడం, జంక్ ఫుడ్స్ తినడం, మ్యాగీలాంటి ఫాస్ట్ ఫుడ్స్ కు అలవాటు పడడం అంటే మన జీవితంలో నాణ్యతను తగ్గించుకున్నట్లే. మనం జీవించే కాలాన్ని కుదించుకున్నట్లే. మరి ఈ ప్రమాదాల పట్ల మనం జాగ్రత్త పడాల్సిన అవసరం లేదా? ఆలోచించండి! క్యారెట్, బీట్రూట్, టమోట సమభాగాల్లో తీసుకొని మిక్సీలో వేసి, మెత్తగా చేసి కొద్దిగా నీళ్లు కలిపి రోజు ఒక్క గ్లాసు ఉదయం తాగితే, శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని పెంచే ఫైటోన్యూట్రియంట్స్ అందుతాయి. అన్నిటికంటే సులభమైంది. టమోటాలు కడిగి మిక్సీలో వేసి వడగొట్టి దానికి 1 - 2 స్పూన్ల తేనె కలిపి తాగడం వల్ల ఎండ, వేడి, వడదెబ్బల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. టమోటాలో వున్న లైకోపిన్ వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కేన్సర్ లాంటి మహమ్మారి నుండి రక్షణ పొందవచ్చు. న్యూడిల్స్, గోబీ 65లు, కంపెనీ బిస్కట్లు తినడం వల్ల పిల్లలకు పోషకహారం అందదు. పిల్లల పెరుగుదలకూ, జ్ఞాపకశక్తికీ కేలరీలతోపాటు ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలున్న సమతులాహారం చాలా అవసరం. ఈ పరిస్థితుల్లో పిల్లలకు ప్రత్యామ్నాయ ఆహార అలవాట్లు చాలా అవసరం. జంక్ ఫుడ్స్ బదులు ఇంట్లో చేసిన తినుబండారాలే శ్రేయస్కరం. చిరుధాన్యాలతో తయారు చేసిన రాగి మురుగులు, కొర్రమురుగులు, జొన్న మురుగులు, రాగి, సజ్జ, జొన్న, కొర్ర కలిగిన మల్టీగ్రైన్ మురుగులు మీ పిల్లలకు పెట్టిచూడండి. శెనగపిండి మిక్సర్, జొన్న, రాగి కలిపిన మిక్సర్ బొరుగుల మిక్సర్, వేరుశనగ ఉండలు, బొరుగుల వుండలు, కూరగాయల తాలింపుతో బ్రెడ్ రోల్స్, చపాతీల్లో తాళింపును నింపి రోల్స్ గా తయారుచేసి ఫ్రాంకీస్ చేసి పెట్టండి. అన్ని రకాల పండ్లు కలిపి జామ్, క్యాండీలు తయారుచేసి పెట్టండి. కంపెనీ బిస్కట్లు కాకుండా రాగి, సజ్జ, జొన్నలతో తయారు చేసిన బిస్కెట్లు పెట్టండి. రాగి, జొన్న, సజ్జ లడ్డూలను బెల్లంతో తయారు చేసి పెట్టండి. మంచి ప్రొటీన్లు అందుతాయి. రుచిగా కూడా ఉంటాయి. రక్తహీనత బారినుండి పిల్లల్ని కాపాడుకోవచ్చు. పిల్లలకు ఆటలు తగ్గిపోయాయి. శారీరక శ్రమలేదు. మలబద్ధకం ఇప్పుడు ఒక ప్రధానమైన సమస్య. ఆకుకూరలు తినమంటే పిల్లలు తినరు. మరేం చేయాలి? ఈ ఆకుకూరలను మెత్తగా ఉడికించి మిక్సీలో వేసి గోధమపిండిలో కలిపి పూరీలో, చపాతీలో చేసి పెట్టండి. రుచీ వుంటుంది, ఆరోగ్యానికీ మేలు. కూరగాయలను ఉడికించి వడియాల పిండితో కలిపి వడియాలు పెట్టండి. రుచిగా వుంటాయి, మంచి రంగునిస్తాయి. ఆరోగ్యానికి మహమ్మారి కూల్ డ్రింక్స్ తాగడం మానేద్దాం : కూల్ డ్రింక్స్ లో పోషకాహారాలు లేవు. తాగినప్పుడు అదనపు క్యాలరీలు మాత్రమే మనకు లభిస్తాయి. ఒక్క కూల్ డ్రింక్ తాగితే 36 రెట్లు పరిమితికి మించి మీ శరీరంలోకి 0.0180 మిల్లీ గ్రాముల క్రిమిసంహారక మందులు చేరతాయి. ఫలితంగా మనకు పప్పిపళ్లు, కిడ్నీలో రాళ్లు, జీర్ణవ్యవస్థలో సమస్యలు, లివర్ సిరోసిస్, కేన్సర్ దాకా ఏ జబ్బయినా రావచ్చు. అందువల్ల కూల్ డ్రింక్స్ ను కేరళలో లాగా నిషేధించాలని పౌర సమాజం పోరాడాలి. విద్యాసంస్థలలో, వైద్యాలయాల్లో, వాటి సమీపంలో కూల్డ్రింక్స్ అమ్మొద్దన్న ప్రభుత్వ ఆదేశాలు అమలయ్యేలా ప్రయత్నించాలి. ఇవి జరిగితే మంచిది, లేకపోతే ఈలోగా కూల్ డ్రింక్స్ బదులుగా కొబ్బరినీళ్లు, నిమ్మరసం, చెరకురసం, మసాల మజ్జిగ, గంజితో షరబత్, రాగిమాల్టు, పానకం లాంటి సహజ పానీయాలు తాగేలా మన పిల్లల్ని ప్రోత్సహించాలి. సోయా గింజల నుండి పాలు, మజ్జిగ లాంటివి తయారు చేసి పిల్లలకు ఇవ్వాలి. ముందు పెద్దలు తాగి పిల్లలకు అలవాటు చేయాలి. ఒక ఆలోచన ప్రాచీనమైనదా, ఈ కాలానిదా అన్నది కాదు. శాస్త్రీయమైనదే ఆచరణనీయం. కూల్ డ్రింక్స్ వద్దని, జంక్ ఫుడ్ మానేయమని మరోసారి విజ్ఞప్తి. వరి తినడం తగ్గించుకోవాలి. తృణధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. చిరుధాన్యాల్లో పోషక పదార్థాలను గమనించండి Protein gm Carbohydrates gm Fats gm Minerals gm Fibre gm Calcium mg Phosphorous mg Iron mg Energy k.cal B1 mg B2 mg వరి 6.8 78.2 0.5 0.6 0.2 10 160 0.7 345 0.06 0.06 రాగులు 7.3 72.0 1.3 2.7 3.6 344 283 3.9 336 0.42 1.1 జొన్న 10.4 70.7 3.1 1.2 2.0 25 222 5.4 329 0.38 4.3 సజ్జ 11.8 67.0 4.8 2.2 2.3 42 - 11.0 363 0.38 2.8 కొర్రలు 12.3 60.0 4.3 4.0 6.7 31 290 2.8 351 0.59 3.2 ఆధారం: టి.స్వర్ణలత, గృహవిజ్ఞాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం.